Sangareddy News : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. కార్యకర్తల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గతాన్ని గుర్తుకు చేసుకుని ఏడ్చేశారు. నియోజకవర్గంలోని కొండాపూర్ మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 7 జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహం సంగారెడ్డి పట్టణంలోని రామాలయం వద్ద నిర్వహించనున్నారు. పెళ్లికి కార్యకర్తలను ఆహ్వానించడంతో పాటు ఇతర పార్టీ అంశాలు చర్చించుకోవడానికి సమావేశం పెట్టారు. మీటింగ్ మొదలు కాగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సమావేశాన్ని సంగారెడ్డి గ్రాండ్ గా నిర్వహించిన సందర్భాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేవని కష్ట కాలంలో పార్టీ నాయకుడు ఆంజనేయులు తన భూమిని అమ్మి డబ్బులు సహాయం చేశాడని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడు జోష్ గా నవ్వుతూ, మంచి ఉత్సాహంగా ఉండే జగ్గారెడ్డి కన్నీరు పెట్టుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు వద్దు సార్ అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన సమావేశం నుంచి వెళ్లిపోయారు.
