Sangareddy News : జిల్లాలో వినాయక నిమజ్జనాలు రేపు (గురువారం) మరియు శనివారం (తేదీలు: 04, 06-09-2025) భారీగా జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ గారు తెలిపారు.
ఎస్పీ గారు మాట్లాడుతూ –
- గణనాథుని శోభాయాత్ర, నిమజ్జనాలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నామని, పెద్ద శబ్దాల డీజే సౌండ్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని తెలిపారు.
- శోభాయాత్ర మార్గంలో కరెంట్ వైర్లు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకున్నామని చెప్పారు.
- ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక డైవర్షన్లు అమలు చేయనున్నామని వివరించారు.
- ప్రధాన కూడళ్లలో, మసీదులు, దర్గాలు, చర్చిల వద్ద బారికేడ్లు, పాలితిన్ కవర్లు ఏర్పాటు చేశామని అన్నారు.
- నిమజ్జన ఘాట్ల వద్ద బారికేడ్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు.
అదనంగా, డీఎస్పీలు బందోబస్తు పర్యవేక్షణ చేస్తారని, అనుకోని పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేందుకు స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు సూచించారు.
ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు:
ఊరేగింపులో కుంకుమ, గులాల్ వంటి రంగులు దారిన వెళ్లే వారిపై వేయకూడదు.
ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజేలను సీజ్ చేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు.
విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాల్లో ఆయుధాలు, పటాకులు, పెట్రోలు, డీజిల్ వంటి మండే పదార్థాలు ఉంచరాదు.
వాహనం వివరాలు, డ్రైవర్ వివరాలు ముందుగానే పోలీసులకు తెలియజేయాలి. వాహనం మంచి స్థితిలో ఉండాలి.
నిమజ్జనంలో పాల్గొనే వారు మత్తు పదార్థాలు వాడకూడదు. నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
వదంతులను నమ్మకూడదు. ఏదైనా అసత్య ప్రచారం గమనించిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి.
