Sangareddy News : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది.
మొత్తం 12 వేల ఎకరాల్లో ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తుండగా, మొదటి దశలో 3,245 ఎకరాల్లో పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులు మొదలవుతున్నాయి. దీనికి రూ.2,369 కోట్లు ఖర్చు కానున్నాయి. టెండర్ల ప్రక్రియ అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతుంది. నవంబర్ నుంచి పనులు మొదలవుతాయి.
ఈ వాడలో రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీ, ఇంటర్నెట్, పార్కులు వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రాజెక్ట్కు దగ్గరలో బీదర్ విమానాశ్రయం (30 కి.మీ.), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (125 కి.మీ.) ఉన్నాయి. అలాగే కృష్ణపట్నం పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్లు దగ్గరగా ఉండటం వల్ల దిగుమతి, ఎగుమతులకు అనుకూలం. జాతీయ రహదారి 65కి కూడా కేవలం 9.3 కి.మీ. దూరంలో ఉంది.
ఈ ప్రాజెక్ట్తో దాదాపు 1.98 లక్షల మందికి ఉద్యోగాలు కలుగుతాయి. ఆటోమొబైల్, విద్యుత్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, యంత్రాలు, లోహ పరిశ్రమలు ఇక్కడ ఏర్పడతాయి. పరిశ్రమలతో పాటు స్థానికులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా వేగంగా అభివృద్ధి చెందనుంది.
