
Sangareddy News : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలులో పారదర్శకత, సమర్థత, వేగం తీసుకొచ్చేందుకు విశేష చర్యలు చేపట్టామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శుక్రవారం కొండాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, దరఖాస్తుల ప్రక్రియ ,విధానాలను సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, భూభారతి గ్రామ సభలలో రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియను త్వరితంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులు భూభారతి చట్టం తహసీల్దార్ లాగిన్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, దానికి అనుగుణంగా భూసంబంధిత సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు భూమి సంబంధిత సర్టిఫికెట్లు, రికార్డులు పొందడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే మా ప్రథమ లక్ష్యం అని అన్నారు . ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి రెవెన్యూ అధికారిపై ఉందని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు భూభారతి రెవెన్యూ టీం లీడర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల స్థాయిలో రెవెన్యూ సేవల అమలుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూభారతి ప్రక్రియలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు.
భూభారతి గ్రామ సభల్లో రైతుల నుండి దరఖాస్తులు ఉచితంగా స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులపై అభ్యంతరాలుంటే, వాటికి సంబంధించి నోటీసులు జారీ చేయడం, ఏడు రోజులలోపే పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి ఏడు రోజులలోపారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు . క్షేత్రస్థాయిలో అధికారులు ముందుగానే పరిశీలన జరపాలని స్పష్టంగా సూచించారు. భూభారతి చట్టం అమలులో ఏదైనా అలసత్వం ఉండకూడదని, పటిష్టంగా అమలుచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై ఆక్రమణలు, దుర్వినియోగాలను గుర్తించేందుకు మండల సర్వే టీమ్లు యాక్టివ్గా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల జాబితాను సిద్ధం చేయాలనీ అన్నారు . భూభారతి పథకం ద్వారా భూసంబంధిత సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గాల ను రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్, ఇతర రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.