
Sangareddy News : సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్ షాపు నం. 28ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా తుకాను, బియ్యాన్ని, రికార్డులను, స్టాకును, అలాగే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారి లిస్టును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సన్నబియ్యం పేదలకు వరం అని పేర్కొన్నారు. జూన్ 30 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేలిముద్రతో సాంకేతిక సమస్యలు వచ్చినా, నిపుణుల బృందం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మూడు నెలల పాటు రేషన్ ఇస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ మాధురి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.